

హైదరాబాద్: ఓ వ్యక్తిని పలువురు పోలీసులు లాఠీలతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భీమ్ ఆర్మీ నేతను పోలీసులు చితకబాదుతున్న దృశ్యాలు ఇవేనని సోషల్ మీడియా వినియోగదారులు ప్రచారం చేస్తున్నారు.
ఒక ఎక్స్ (X) యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, "మొన్న ఏలూరులో దళిత క్రైస్తవ సభలో శ్రీ రామునిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు దూషణలు చేసిన సురేష్ జాతవ్ అనే వాడిని ఏలూరు పోలీస్ స్టేషన్లో పెట్టి సకల మర్యాదలు చేస్తున్న పోలీసులు." అని క్యాప్షన్ ఇచ్చాడు. (ఆర్కైవ్)
ఈ క్లెయిమ్ తప్పు అని సౌత్ చెక్ గుర్తించింది. వైరల్ వీడియో 2021లో మహారాష్ట్రలోని జల్నాలో కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించినది. ఆసుపత్రి ఐసీయూను ధ్వంసం చేసిన ఆరోపణలపై ఓ బీజేపీ కార్యకర్తపై పోలీసులు బలప్రయోగం చేసిన వీడియోను ఇప్పుడు తప్పుడు కథనంతో వైరల్ చేస్తున్నారు.
వైరల్ వీడియోలోని కీలక ఫ్రేమ్లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 2021 మే 28న ABP మాజా ప్రచురించిన కథనం కనిపించింది. ఆ కథనంలో ఇదే వీడియోను పొందుపరిచారు.
ఆ కథనం ప్రకారం, జల్నా జిల్లా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ నారియల్వాలేపై పోలీసులు దాడి చేశారని, దీనిపై అప్పటి మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ఆధారంతో కీవర్డ్ సెర్చ్ చేయగా, 2021 మే 27న News18 Marathi ఎక్స్లో ఇదే వీడియోను షేర్ చేసినట్లు గుర్తించాం. కోవిడ్ ఆసుపత్రిలోకి చొరబడి ఐసీయూను ధ్వంసం చేసిన ఆరోపణలపై ఓ బీజేపీ కార్యకర్తను పోలీసులు కొట్టారని ఆ పోస్టులో పేర్కొన్నారు.
అదే ఘటనపై ANI కూడా 2021 మే 27న ఎక్స్లో పోస్టు చేసింది. జల్నా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ మహాజన్ను ఉటంకిస్తూ, "ఏప్రిల్ 10న ఓ రోగి మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిని ధ్వంసం చేశారు. వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు" అని పేర్కొంది.
పోలీసులు వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని బీజేపీ యువ మోర్చా నాయకుడు శివరాజ్ నారియల్వాలేగా గుర్తించారు.
ఈ ఘటనకు భీమ్ ఆర్మీతో కానీ, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణతో కానీ ఎలాంటి సంబంధం లేదు.
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని భీమ్ ఆర్మీ నేతను పోలీసులు కొట్టిన వీడియో ఇది కాదు. మహారాష్ట్రలోని జల్నాలో కోవిడ్ ఆసుపత్రి ఐసీయూను ధ్వంసం చేసిన ఘటన అనంతరం బీజేపీ కార్యకర్తపై పోలీసులు బలప్రయోగం చేసిన 2021 నాటి వీడియోను తప్పుడు ప్రచారంతో వైరల్ చేస్తున్నారు.
కాబట్టి, ఈ క్లెయిమ్ తప్పు.