Fact Check : పోల్ స్ట్రాటజీ గ్రూప్ నిర్వహించిన సర్వేలో టీడీపీ కూటమి కాకుండా YSR కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది

పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నట్లు చూపుతున్న చిత్రాలు సవరించబడ్డాయి.
Fact Check : పోల్ స్ట్రాటజీ గ్రూప్ నిర్వహించిన సర్వేలో టీడీపీ కూటమి కాకుండా YSR కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది

ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలకు సంబంధించి పోల్ స్ట్రాటజీ గ్రూప్ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలను వివరించే రెండు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఒక చిత్రంలో పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎక్కువ సీట్లతో ఆధిక్యంలో ఉందని, టీడీపీ కూటమి 120-130 అసెంబ్లీ స్థానాలు, YSR కాంగ్రెస్ పార్టీ 45-55 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటాయని , ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి 19-21 సీట్లతో ఆధిక్యంలో ఉందని, YSR కాంగ్రెస్ పార్టీ 4-6 సీట్లు గెలుచుకుంటాయని సర్వే అంచనా వేసినట్లు చూపుతున్నాయి.

మరో చిత్రంలో టీడీపీ కూటమికి 50-52 శాతం, YSR కాంగ్రెస్‌ పార్టీకి 44-46 శాతం, ఇతరులకు 3-5 శాతం ఓట్ల షేర్‌ శాతాన్ని చూపించే పై-చార్ట్‌ని చూడవచ్చు.

ఫేస్‌బుక్ వినియోగదారు "ఏపీ ప్రజల్లారా.. ప్రజా ప్రభుత్వం రాబోతుంది' #TDPWillBeBack" అనే క్యాప్షన్‌తో  ఈ చిత్రాలను షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే ఫలితాల్లో టీడీపీ కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని చూపిస్తున్న వైరల్ చిత్రాలు ఎడిట్ చేయబడ్డాయని సౌత్ చెక్ కనుగొంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలకు సంబంధిం పోల్ స్ట్రాటజీ గ్రూప్ విడుదల చేసిన సర్వే ఫలితాల కోసం మేము శోధించగా, పోల్ స్ట్రాటజీ గ్రూప్ అధికారిక X ఖాతాలో ఆంధ్రప్రదేశ్ ప్రీ పోల్ సర్వే ఫలితాలు ఉన్న ఒక పోస్ట్‌ను కనుగొన్నాము.

పోల్ స్ట్రాటజీ గ్రూప్ రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికల కోసం ప్రీ పోల్ సర్వేను మార్చి 15 నుండి ఏప్రిల్ 10 మధ్య ఒక లక్షా నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు నమూనా పరిమాణంతో నిర్వహించింది. అయితే ఈ సర్వే ఫలితాలను ఏప్రిల్ 14న విడుదల చేసింది.

పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే అంచనాలు:
అసెంబ్లీ సీట్లు:
YSR కాంగ్రెస్ పార్టీ 120-130 సీట్లు గెలుస్తుంది
టీడీపీ కూటమి 45-55  సీట్లు గెలుస్తుంది
ఇతరులు సున్నా

లోక్ సభ సీట్లు:
YSR కాంగ్రెస్ పార్టీ 19-21 సీట్లు  గెలుస్తుంది
టీడీపీ కూటమి 4-6 సీట్లు గెలుస్తుంది
ఇతరులు సున్నా

YSR కాంగ్రెస్ పార్టీకి 50-52 శాతం, టీడీపీ కూటమికి 44-46 శాతం, ఇతరులకు 3-5 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.

ఇప్పుడు వైరల్ చిత్రాలలో ఉన్న సర్వే ఫలితాలు మరియు పోల్ స్ట్రాటజీ గ్రూప్ యొక్క అధికారిక ఖాతాలో షేర్ చేయబడిన చిత్రాలలోని సర్వే ఫలితాలు రెండింటినీ పోల్చి చూస్తే, పోల్ స్ట్రాటజీ గ్రూప్ విడుదల చేసిన సర్వే ఫలితాలను టీడీపీ కూటమికి మద్దతుగా చూపేటట్టు సవరించబడిందని, పై-చార్ట్‌లో కూడా టీడీపీ కూటమికి ఓట్ల శాతం ఎక్కువ వచ్చినట్టు సవరించబడిందని  మేము నిర్ధారించాము.

YSR కాంగ్రెస్‌ పార్టీకి అంచనా వేసిన ఫలితాలను టీడీపీ కూటమికి మార్చుకున్నారు.

అందుకే, పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే ప్రకారం టీడీపీ కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని చూపిస్తున్న వైరల్ చిత్రాలు ఎడిట్ చేయబడ్డాయని మేము నిర్ధారించాము. నిజానికి పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే ప్రకారం YSR కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in