ఫ్యాక్ట్ చెక్: భారతీయులకు మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జూ క్షమాపణలు చెప్పలేదు

మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జూ క్షమాపణలు చెప్పిన ఓ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెక్: భారతీయులకు మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జూ క్షమాపణలు చెప్పలేదు

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనకు వెళ్ళినప్పుడు మాల్దీవులకు చెందిన నేతలు విమర్శలు చేశారు. ప్ర‌ధాని మోదీ లక్షద్వీప్‌లో టూరిజాన్ని ప్రోత్స‌హించేందుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు ఫొటోలు షేర్ చేసిన అనంత‌రం.. ఆ దేశ మంత్రి మ‌రియం షియునా మోదీ ల‌క్ష్యంగా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆపై సోష‌ల్ మీడియాలో తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో ఆయా ట్వీట్‌ల‌ను డిలీట్ చేసింది. దీంతో మాల్దీవుల్లో భార‌త హై క‌మిష‌న‌ర్ ఈ అంశాన్ని మ‌హ్మ‌ద్ మిజు నేతృత్వంలోని మాలే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.

ఇలాంటి సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జూ క్షమాపణలు చెప్పిన ఓ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. తన దేశ మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జూ భారతీయులకు ముకుళిత హస్తాలతో క్షమాపణలు చెబుతున్నట్లు ఆ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

ప్రముఖ సోషల్ మీడియా పర్సనాలిటీ అయిన రిషి బాగ్రీ తన ప్రీమియం X హ్యాండిల్‌లో షేర్ చేసిన అదే ట్వీట్‌ను కూడా మేము కనుగొన్నాము.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన తర్వాత మాల్దీవులకు చెందిన ముగ్గురు నేతలు ఆయనను, లక్షద్వీప్‌ను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వివాదం నెలకొంది. ఆ దేశ నేతలు భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘క్లౌన్,’ ‘తోలుబొమ్మ’, ‘ఉగ్రవాది’ అని అభివర్ణించారు (ఇప్పుడు ఆ ట్వీట్లు తొలగించారు). ముగ్గురు మంత్రులు మల్షా షరీఫ్, మరియం షియునా, అబ్దుల్లా మహ్జూమ్ మజీద్ ను సస్పెండ్ చేశామని మాల్దీవుల ప్రభుత్వం తెలిపింది.


ఫ్యాక్ట్ చెకింగ్:


మాల్దీవుల అధ్యక్షుడి వైరల్ ట్వీట్ నకిలీదని సౌత్ చెక్ కనుగొంది.
మేము మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జు X హ్యాండిల్‌లో వైరల్ ట్వీట్ కోసం వెతికాము. అయితే వైరల్ స్క్రీన్ షాట్ ను పోలిన ట్వీట్ మాకు కనిపించలేదు. ఆ  ట్వీట్‌లో మేము జనవరి 7న పోస్టు చేసినట్లు గుర్తించాం. అయితే ఆ పోస్ట్‌ల జాబితాలో వైరల్ స్క్రీన్ షాట్ లోని ట్వీట్ మేము గుర్తించలేకపోయాం.

ఇలాంటి ట్వీట్ కు సంబంధించిన మీడియా నివేదికల కోసం కూడా వెతికాము, కానీ క్షమాపణలను నివేదించిన విశ్వసనీయ మీడియా సైట్ ఏదీ కనుగొనలేకపోయాం. ఆ ట్వీట్ నిజమైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా దృష్టిని తప్పకుండా ఆకర్షించి ఉండేది.

డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జూ చేసిన తాజా ట్వీట్ జనవరి 5, 2024న భారతదేశానికి లేదా ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధం లేనిది.

మేము మరింత ధృవీకరణ కోసం, ఆ ట్వీట్‌లను తొలగించారో.. లేదో తెలుసుకోవడానికి వేబ్యాక్ మెషీన్‌ని ఉపయోగించి ఆర్కైవ్‌ల కోసం కూడా తనిఖీ చేసాము.. కానీ ఆయన అకౌంట్ లో అలాంటి ట్వీట్ ఏదీ కనుగొనలేదు.

మాల్దీవుల ప్రభుత్వం జనవరి 7, 2024 నాటి వెబ్‌సైట్‌లో ప్రచురించిన అధికారిక ప్రకటనను మేము కనుగొన్నాము. అక్కడ మాల్దీవులు ప్రభుత్వం 'విదేశీ నాయకులు, ఉన్నత స్థాయి వ్యక్తులపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అవమానకరమైన వ్యాఖ్యల గురించి తెలుసుకుంటోంది' అని తెలిపింది. మంత్రుల ప్రస్తావన తీసుకుని రాకుండా  'ఈ అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి, మాల్దీవుల ప్రభుత్వ అభిప్రాయాలకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి అవమానకర వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదు’ అని కూడా స్పష్టం చేసింది.

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి నిజం లేదని తెలుసుకున్నాం. 

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in