
Hyderabad: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేరారని క్లెయిమ్ చేస్తున్న ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ ప్రకటనలో "విషయం: రహస్యం - CMH రావల్పిండిలో గౌరవనీయ ప్రధానమంత్రి ఆసుపత్రిలో చేరడం" అని రాశారు.
"ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ గౌరవనీయ ప్రధానమంత్రి ఏప్రిల్ 27, 2025న రావల్పిండిలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ (CMH)లో హెమోరాయిడ్స్ కేసుకు సంబంధించిన వైద్య మూల్యాంకనం, చికిత్స కోసం చేరారని ఇందుమూలంగా తెలియజేయబడుతోంది. ప్రధానమంత్రి CMHలోని ప్రత్యేక వైద్య బృందం నిపుణుల సంరక్షణలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది, ఆయన చికిత్సకు బాగా స్పందిస్తున్నారు."
వైద్యులు సూచనల ప్రకారం ముందు జాగ్రతగా ఆసుపత్రిలో చేరడం జరిగిందని, ఈ సమాచారాన్ని కఠినమైన గోప్యతతో కాపాడాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ప్రకటన చిత్రాన్ని ఫేస్బుక్లో పంచుకుంటూ ఇలా రాశారు, "పాకిస్తాన్ ప్రధాన మంత్రి షబాజ్ షరీఫ్ పైల్స్ ఆపరేషన్ కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు..... ఇలాంటి సమయం లో బీపీ లేదా టెన్షన్ వలన బ్రెయిన్ తలనొప్పి రావాలి కదా...." (ఆర్కైవ్)
Fact Check
సౌత్ చెక్ ఈ క్లెయిమ్ కనుగొంది. వైరల్ అవుతున్న ప్రకటన నిజమైనది కాదు.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఆసుపత్రిలో చేరినట్లు చూపించే సమాచారం కోసం కీవర్డ్ శోధనను నిర్వహించాం, అయితే ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లేదా అధికారిక ప్రకటనలు లభించలేదు.
పాకిస్తాన్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా దీని గురించి ఎలాంటి పోస్టులు చేసినట్లు కనిపించలేదు.
వైరల్ ప్రకటనపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి చిహ్నం, తేదీ, ప్రధాన మంత్రి ఆఫీస్ చిరునామా, ఈ ప్రకటన జారీ చేసినట్లు ప్రధాన కార్యదర్శి సంతకం, చిరునామా ఉన్నాయి.
పాకిస్తాన్ ప్రధాన కార్యదర్శి పేరు అసద్ రెహమాన్ గిలానీ అని ఉంది. అయితే, కీ వర్డ్ సెర్చ్ ద్వారా Dawn అనే పాకిస్తాన్ వార్త పత్రిక వెబ్సైట్లో 18 మార్చ్ 2025న ప్రచురించిన కథనం దొరికింది.
ఈ కథనం శీర్షిక "ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి అసద్ రెహమాన్ గిలానీ బదిలీ." ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తన ప్రధాన కార్యదర్శి అసద్ రెహ్మాన్ గిలానీని తొలగించారు అని పేర్కొన్నారు. 17 మార్చ్ 2025 జారీ చేయబడిన అధికారిక ప్రకటన ప్రకారం, ప్రధాన మంత్రి (PSPM) ప్రధాన కార్యదర్శి గిలానీని జాతీయ వారసత్వ, సంస్కృతి విభాగానికి బదిలీ చేశారు.
"ప్రధానమంత్రి PSPM పదవిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారని, ఆయన కొత్తగా నియమించబడిన సలహాదారు, సమాఖ్య మంత్రి హోదా కలిగిన డాక్టర్ తౌకిర్ షా, PSPM స్థానంలో ప్రధానమంత్రి సలహాదారు హోదాలో పనిచేస్తారని వర్గాలు Dawnతో తెలిపాయి," అని రాశారు.
వైరల్ ప్రకటనపై ఏప్రిల్ 27 అనే తేదీ ఉంది. కానీ, పాక్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అసద్ రెహమాన్ గిలానీ అంతకుముందే, అంటే 17 మార్చి 2025న వేరే శాఖకు బదిలీ అయ్యారని తేలింది. కాబట్టి, ఈ సమాచారం వైరల్ ప్రకటన విశ్వసనీయతపై సందేహాలను లేవనెత్తుతుంది.
24NewsHD అనే వార్త పత్రిక మే 1, 2025న ప్రచురించిన కథనం ప్రకారం, "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్ గురువారం ఇస్లామాబాద్లోని ప్రధాన మంత్రి కార్యాలయంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కలిసి, దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వాన్ని సాధించాలనే రెండు దేశాల ఉమ్మడి కోరికను సాధించడానికి చైనా ఎల్లప్పుడూ పాకిస్తాన్కు మద్దతు ఇస్తుందని నొక్కి చెప్పారు," అని రాశారు. ఈ కథనం ప్రకారం చూస్తే పాక్ ప్రధాని షరీఫ్ తన నివాసంలోనే చైనా రాయబారిని కలిశారని తెలుస్తోంది.
ఇదే వైరల్ ప్రకటనను తప్పు అని నిర్ధారిస్తూ, 2025 ఏప్రిల్ 29న Dawn రాసిన ఫాక్ట్ చెక్ కథనంలో "వైరల్ ప్రకటన నకిలీదని PMO అధికారి ఒకరు Dawn కరస్పాండెంట్ సనావుల్లా ఖాన్తో అన్నారు," అని రాశారు. ఈ కథనం ద్వారా వైరల్ ప్రకటన నకిలీది అని ధృవీకరించబడింది.
కాబట్టి వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు అని సౌత్ చెక్ నిర్ధారించింది.