Fact Check: బాబ్రీ మసీదు స్థలంలో రాహుల్ గాంధీ, ఓవైసీ కలిసి కనిపించారా? కాదు, వైరల్ చిత్రాలు ఏఐ సృష్టించినవే

బాబ్రీ మసీదు స్థలంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కలిసి ఉన్నట్లు చూపిస్తున్న రెండు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Viral images claiming to show Congress MP Rahul Gandhi and AIMIM chief Asaduddin Owaisi together at the Babri Masjid site are circulating on social media.
Published on
2 min read

హైదరాబాద్: అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు 33 ఏళ్లు పూర్తైన సందర్భంగా, డిసెంబర్ 6న పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా రేజీనగర్ ప్రాంతంలో ‘బాబ్రీ మసీదు’ పేరుతో నిర్మించనున్న మసీదుకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ శంకుస్థాపన చేశారు. ఈ ఘటన, వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర రాజకీయ ధ్రువీకరణ ఉన్న పశ్చిమ బెంగాల్‌లో మరింత వేడి రాజేసింది.

ఈ నేపథ్యంలో,బాబ్రీ మసీదు స్థలంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కలిసి ఉన్నట్లు చూపిస్తున్న రెండు చిత్రాలు ఫేస్‌బుక్‌లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

ఒక ఫేస్‌బుక్ యూజర్, అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన నేతలే ఇప్పుడు బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మాణానికి పునాది వేస్తున్నారని ఆరోపిస్తూ, దేశంలో హిందూ దేవాలయాల నిర్మాణానికి అనుమతుల పేరుతో అడ్డంకులు పెడుతున్నారని వ్యాఖ్యానిస్తూ ఈ చిత్రాన్ని షేర్ చేశాడు.

మరో ఫేస్‌బుక్ పోస్టులో, రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మాణానికి నిధులు సేకరించారని, ఓవైసీతో కలిసి ఈ పనిలో పాల్గొంటున్నారని పేర్కొంటూ మరో చిత్రాన్ని షేర్ చేశారు.

ఫ్యాక్ట్ చెక్

ఈ క్లెయిమ్ తప్పు అని సౌత్ చెక్ నిర్ధారించింది.వైరల్ అవుతున్న చిత్రాలు ఏఐ ద్వారా సృష్టించబడ్డవే.

బాబ్రీ మసీదు స్థలంలో రాహుల్ గాంధీ, ఓవైసీ కలిసి ఉన్నారని మీడియా రిపోర్ట్ చేసిందా?

రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరూ కలిసి బాబ్రీ మసీదు స్థలంలో ఉన్నట్లు చూపించే విశ్వసనీయ మీడియా కథనాలు లేదా ధృవీకరించిన ఫోటోలు ఉన్నాయా అని సౌత్ చెక్ పరిశీలించింది. అయితే, ప్రధాన మీడియా సంస్థలలో అలాంటి ఎలాంటి కథనాలు లేదా నిజమైన చిత్రాలు లభించలేదు. విశ్వసనీయ వార్తా వనరుల్లో సమాచారం లేకపోవడం వల్లే ఈ చిత్రాలు కల్పితమైనవని స్పష్టమవుతోంది.

ఏఐ వాడకాన్ని సూచించే దృశ్య లోపాలు

మీడియా నివేదికల ప్రకారం, ముర్షిదాబాద్ జిల్లా రేజీనగర్‌లో అయోధ్య బాబ్రీ మసీదు నమూనాలో నిర్మించనున్న మసీదుకు ఇప్పటివరకు శంకుస్థాపన మాత్రమే జరిగింది. పూర్తి స్థాయి నిర్మాణం ప్రారంభమైందన్న సమాచారం లేదు.

అయితే వైరల్ చిత్రాల్లో, నిర్మాణం దాదాపు పూర్తైనట్టుగా కనిపించే మసీదు ఆకృతి, దాని చుట్టూ స్తంభాలు, గోడలు వంటి నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. ఇవి వాస్తవ నివేదికలకు పొంతన లేకుండా ఉండటంతో, ఈ చిత్రాలు AI ద్వారా రూపొందించబడినవని స్పష్టమవుతోంది.

ఏఐ డిటెక్షన్ టూల్ ద్వారా నిర్ధారణ

సౌత్ చెక్, హైవే మోడరేషన్, డీప్ ఫేక్ ఓ మీటర్ అనే AI కంటెంట్ గుర్తింపు సాధనంతో ఈ చిత్రాలను విశ్లేషించింది. ఫలితాల్లో, ఈ చిత్రాలు అధిక స్థాయిలో AI-సృష్టితమైనవిగా గుర్తించబడ్డాయి. అంటే ఇవి నిజ సంఘటనల నుంచి తీసిన ఫోటోలు కావని స్పష్టమైంది.

బాబ్రీ మసీదు స్థలంలో రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఓవైసీ కలిసి ఉన్నట్లు చూపించే విశ్వసనీయ ఆధారాలు ఏవీ లేవని సౌత్ చెక్ నిర్ధారించింది. వైరల్ చిత్రాలు ఏఐ సృష్టించినవే. అందువల్ల ఈ క్లెయిమ్ తప్పు.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in