Telugu

Fact Check: మే 14 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పని చేయవు? వైరల్ అవుతున్న వీడియో వెనుక నిజం ఇదే

మే 14 నుంచి ప్రతి ఆదివారం పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు పని చేయవంటూ ఈటీవీ న్యూస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Southcheck Network

హైదరాబాద్: పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ఇంధనాన్ని ఆదా చేయాలని, విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు సూచించారు.

గుజరాత్‌లోని వడోదరలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ, కరోనా కాలంలో అమలు చేసిన వర్క్ ఫ్రం హోమ్, ఆన్‌లైన్ క్లాసులు, వర్చువల్ మీటింగ్స్ వంటి విధానాలను మళ్లీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో, “మే 14 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పని చేయవు” అంటూ ఓ న్యూస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో తెలుగు న్యూస్ యాంకర్ మాట్లాడుతూ, ఇంధన వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులను మూసివేయనున్నట్లు చెబుతున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పరిరక్షణ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు.

ఓ ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, “ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ మే 14 నుండి ఎనిమిది రాష్ట్రాలలో అమలు చేయనున్న ప్రభుత్వం.” అంటూ పోస్టు చేశారు. (Archive)

ఫ్యాక్ట్ చెక్

సౌత్ చెక్ పరిశీలనలో వైరల్ అవుతున్న న్యూస్ వీడియో పాతదని, ప్రస్తుతం దీనికి ఎలాంటి సంబంధం లేదని తేలింది.

2017 నాటి ఈటీవీ వీడియో

వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం కీవర్డ్స్‌తో యూట్యూబ్‌లో వెతకగా, ఇదే వీడియోను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ 2017 ఏప్రిల్ 19న అప్లోడ్ చేసినట్లు గుర్తించాం.

ఆ వీడియోలో ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఆదివారాల్లో పెట్రోల్ బంకులను మూసివేయాలనే ప్రతిపాదనపై వార్త ప్రసారం చేశారు.

దీంతో వైరల్ వీడియో పాతదని, 2026లో తీసుకున్న ఏ నిర్ణయానికీ దీనికి సంబంధం లేదని స్పష్టమైంది.

ప్రస్తుతం ఎలాంటి ప్రకటన లేదు

మే 14, 2026 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేస్తారంటూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పెట్రోలియం డీలర్ల సంఘాలు ఇటీవల ఎలాంటి ప్రకటన చేశాయా అని కీవర్డ్స్‌తో వెతికాం. అయితే, అలాంటి అధికారిక ప్రకటన లేదా విశ్వసనీయ వార్తా కథనాలు ఏవీ కనిపించలేదు.

పరిశీలనలో 2017 ఏప్రిల్‌లో వచ్చిన పలు వార్తా కథనాలు లభించాయి. వాటి ప్రకారం తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఆదివారాల్లో పెట్రోల్ బంకులు మూసివేయాలని అప్పట్లో ప్రతిపాదించారు.

ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రజలకు సూచించిన తర్వాత ఈ ప్రతిపాదన వచ్చినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.

ఈ ప్రతిపాదనను కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్ సభ్యులు ప్రకటించినప్పటికీ, తర్వాత దానిని ఉపసంహరించుకున్నారు. అది శాశ్వతంగా అమల్లోకి రాలేదు.

ప్రస్తుతం ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేయాలనే ఎలాంటి అధికారిక నిర్ణయం లేదు.

కాబట్టి, వైరల్ అవుతున్న క్లెయిమ్ తప్పు.

Fact Check: Nepal floods–Rescue operation saves stranded man? No, video is from Mexico

Fact Check: നേപ്പാളില്‍ പ്രളയത്തിനിടെ ഡാം തകരുന്ന ദൃശ്യം? വീഡിയോയുടെ സത്യമറിയാം

Fact Check: முதல்வர் விஜய் பாணியில் விநாயகர் சிலை செய்யப்பட்டதாகப் பரவும் படம்: உண்மை என்ன?

Fact Check: ನೇಪಾಳದಲ್ಲಿ ಪ್ರವಾಹ ನಂತರ ಮುಸ್ಲಿಮರಿಂದ ಕುರಾನ್ ಪಠಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಾಗುತ್ತಿದೆಯೇ? ಸುಳ್ಳು, ಸತ್ಯ ಇಲ್ಲಿದೆ

Fact Check: ‘బాంబు పరీక్ష’లో మదర్సా టీచర్, కుటుంబం మృతి? కాదు, వీడియోలో కనిపించింది సిలిండర్ పేలుడు